Posts Slider
Andhra Pradesh
‘జల’ జగడం: సుప్రీం చేతిలో పోలవరం భవితవ్యం..
రేవంత్పై ఏపీ మంత్రి ఫైర్!
(వాడివేడిగా గోదావరి జలాల వివాదం – ఢిల్లీలో సుప్రీం విచారణ)
(అమరావతి/న్యూఢిల్లీ – తెలుగు ప్రపంచం ప్రత్యేక ప్రతినిధి)
సంక్రాంతి పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య “జల” రాజకీయం మరోసారి వేడెక్కింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు భవితవ్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో కీలక విచారణ జరుగుతుండగా, మరోవైపు ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
సుప్రీంకోర్టులో ‘బిగ్ డే’ (Big Day): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలవరం ప్రాజెక్టు మరియు నల్లమలసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు (జనవరి 13) అత్యంత కీలకమైన రోజు. ఈ ప్రాజెక్టులపై గతంలో దాఖలైన పలు పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) నేతృత్వంలోని ధర్మాసనం సిద్ధమైంది.
- ఏపీ వాదన: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చట్టబద్ధమని, విభజన చట్టం హామీ అని ఏపీ ప్రభుత్వం బలంగా వినిపించేందుకు సిద్ధమైంది.
- తెలంగాణ అభ్యంతరం: ముంపు ప్రాంతాలు, బ్యాక్ వాటర్ (Back water) సమస్యలపైన తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది.
- ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల అడ్వకేట్ జనరల్స్, సీనియర్ న్యాయవాదులతో ఢిల్లీలో హడావిడి నెలకొంది.
మాకు నీళ్లు కావాలి.. తగాదాలు కాదు: మరోవైపు, గోదావరి జలాల పంపిణీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వంలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు తీవ్రంగా స్పందించారు.
మంత్రి నిమ్మల ఏమన్నారంటే..
“ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు కావాల్సింది సాగునీరు.. పొరుగు రాష్ట్రంతో తగాదాలు కాదు. మేం స్నేహపూర్వక వాతావరణాన్ని కోరుకుంటున్నాం. కానీ తెలంగాణ ప్రభుత్వం అనవసరంగా నీటి అంశాన్ని రాజకీయం చేస్తోంది. గోదావరి జలాలపై మాకు రావాల్సిన న్యాయమైన వాటాను వదులుకునే ప్రసక్తే లేదు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారికి తగదు.”
రాజకీయ రంగు: సాధారణంగా పండుగ వేళల్లో రాజకీయాలు కాస్త చల్లబడతాయి. కానీ, ఈసారి సంక్రాంతికి ముందే నీటి మంటలు రాజుకున్నాయి. పోలవరం ఎత్తు, ముంపు మండలాలు, గోదావరి జలాల మళ్లింపు వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
సుప్రీంకోర్టు పోలవరం కేసులో ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? మంత్రి నిమ్మల వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రులు ఎలా కౌంటర్ ఇస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా, “జల జగడం” ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
Telangana
చుక్కాని పట్టుకున్న కవి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా
ఒక పుస్తకం మొదటిసారి చేతుల్లో పట్టుకున్నప్పుడు కలిగే అనుభవం వేరే ఏ అనుభవానికీ పోలదు. కాగితం వాసన, పేజీల అంచు, ఆ కొంచెం బరువు ఇవన్నీ కలిసి ఏదో ఒక వాగ్దానం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ‘కొత్తపలక’ అనే పుస్తకం నాకు అలా అనిపించింది. చదువుతుంటే మొదటి పేజీ నుండే అర్థమైంది -ఇది ఏ పండితుడు రాసిన ఉపన్యాసం కాదు. ఇది ఎవరో జీవితాన్ని లోపలికి తీసుకుని, అనుభవించి, మళ్ళీ బయటకు అక్షరాలుగా ఇచ్చిన ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలు చేసిన మనిషి – ఏనుగు నరసింహారెడ్డి.
తెలుగులో కవులు చాలా మంది ఉన్నారు. మంచి కవులూ ఉన్నారు. కానీ కవిత్వాన్ని జీవితంలా, జీవితాన్ని కవిత్వంలా జీవించిన వాళ్ళు చాలా తక్కువ. నరసింహారెడ్డి ఆ తక్కువ మందిలో ఒకరు. అందుకు నిదర్శనం ఆయన రాసిన పదాలు కాదు ఆయన బతికిన బతుకు. కల్లోనికుంట పల్లె మట్టిలో పుట్టి, వలస బాటల ఉప్పు నీళ్ళు తాగి, అనాథత్వపు చీకటిలో పెరిగి, చివరకు IAS అయి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడైన మనిషి ఆ మనిషికి మరొకరు ఏ విషయాన్నీ ‘నేర్పించాల్సిన’ అవసరం లేదు. జీవితమే నేర్పించింది.
శ్రీశ్రీ ఒకసారి అన్నాడు
నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!
నేను సైతం విశ్వవృష్టికి అశ్రు వొక్కటి ధారపోశాను!
– శ్రీశ్రీ , మహాప్రస్థానం
నరసింహారెడ్డి జీవితాన్ని ఈ రెండు వాక్యాలతో చదవడానికి ప్రయత్నిద్దాం. ‘సమిధ’ కాల్చుకుని వెలిగించే పుల్ల. ‘అశ్రు’ తన నొప్పి తాను మోస్తూ ఇతరుల దుఃఖానికి తడిసే కన్నీటి చుక్క. ఈ రెండూ ఒకే మనిషిలో ఉంటాయా? నరసింహారెడ్డిలో ఉన్నాయి. అందుకే ఆయన కవిత్వం చదివేటప్పుడు ఒకచోట అగ్ని తాకుతుంది, మరొకచోట తడి తగిలిస్తుంది.
✦ ✦ ✦
1968. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక పల్లె. తండ్రి కృష్ణారెడ్డి రైతు. తల్లి లక్ష్మమ్మకు అక్షరజ్ఞానం లేదు. వ్యవసాయం జీవికగా ఉన్న కుటుంబం — అయితే ఆ జీవిక ఒకరోజు కుదుపు తింది. గిట్టుబాటు ధరలు లేక పొలం నిలవలేదు. ఆ చేతులు చేసే పని ఆ నోటికి చేరడం లేదు. ఎంత దారుణమైన సమీకరణమో — శ్రమ ఉంది, ఫలం లేదు. అలాంటప్పుడు మనిషి ఏం చేయగలడు? కుటుంబం వలస బాటలో పడింది.
‘వలస’ అనే పదం వినగానే చాలా మంది ఒక చలనచిత్రాన్ని ఊహిస్తారు — పల్లె నుండి నగరానికి వెళ్ళిపోయే సినిమాటిక్ దృశ్యం. కానీ నిజమైన వలస అలా ఉండదు. అందులో రాత్రంతా నడవడం ఉంటుంది, తెలియని ఊళ్ళలో తెలియని ముఖాలు ఉంటాయి, ‘ఇది మన ఊరు కాదు’ అనే అపరిచిత వాసన ఉంటుంది. నరసింహారెడ్డి ఆ వాసన చిన్నప్పుడే పీల్చాడు. కృష్ణాజిల్లా పెనుమలారు, తర్వాత చెన్నై. ఆ పరిచయం కాని నేల మీద నిలిచిన పాదాలే తర్వాత ‘వలస కాలం’ కవితలో మాట్లాడాయి.
ఆ వలస జీవితం నడుమ ఇంకో దెబ్బ. తండ్రికి క్షయవ్యాధి (టీబీ) వచ్చింది. వైద్యం చేయించుకోలేని పరిస్థితి. మూడేళ్ళ పిల్లవాడికి తండ్రి అర్థమయ్యే వయసు కాదు. కానీ తండ్రి పోయాడు అని అర్థమైంది. ఆ ‘పోవడం’ అర్థమైన తర్వాత ఆ చిన్నారికి ప్రపంచం కొంచెం బరువెక్కింది. ఒంటరిగా మోయాల్సిన బరువు. సినారె ఒక కవితలో అన్నారు
సూదిపోట్లకు గుండెచాచి
బాధలకు భాష్యాలు రాసి
ఎంత చేదును మింగెనో
ఇంత పలుచటి జీవితం
-సి.నా.రె
‘పలుచటి జీవితం’ ఎంత సరైన పదం. ఒక చిన్న గాలి వీస్తే ఎగిరిపోయేలా పలుచగా ఉండే జీవితం. నరసింహారెడ్డిది అలాంటి జీవితమే. కానీ ఆ పలుచదనంలోంచి బయటపడిన మనిషి బండరాయి అవుతాడు. ఆ బండరాయిపై అక్షరాలు చెక్కితే అవి శాశ్వతంగా ఉంటాయి.
✦ ✦ ✦
అక్షరజ్ఞానం లేని లక్ష్మమ్మ గురించి ఒక్కక్షణం ఆగి ఆలోచిద్దాం. ఆమెకు అక్షరాలు రాకపోవచ్చు. కానీ ఒక పాఠం తెలుసు ఆగకూడదు. భర్త పోయిన తర్వాత హైదరాబాద్కు వచ్చి భవన నిర్మాణ కూలీగా పని చేసింది. నిర్మాణం కూల్చడానికి వచ్చింది కాదు కట్టడానికి వచ్చింది. అదే సమయంలో ఒక కొడుకును కట్టింది. అతనికి తెలియకుండానే.
నరసింహారెడ్డి ‘రాలక ముందటి పూలు’ కవిత రాశారు. ముసలితనంలో అమ్మలు పిల్లల్లా ఎందుకు అవుతారో చెప్పే కవిత. చదివినవాళ్ళకి తెలుసు అది అమ్మ గురించి కాదు, తన తల్లి గురించి. తల్లి అనారోగ్యం, తల్లి మరిచిపోవడం, తల్లి అర్థం లేకుండా మాట్లాడడం ఇవి కళ్ళతో చూసే ప్రతి బిడ్డ హృదయం ఆర్తపడుతుంది. కానీ ఆ ఆర్తిని అక్షరాలుగా మార్చగలిగే మనిషి అరుదు. నరసింహారెడ్డి అలాంటివాడు.
‘అమ్మ’ అనే ప్రతీక తెలుగు కవిత్వంలో చాలా వాడారు. కానీ ఆ ప్రతీక ఆయనకు కాల్పనిక అలంకారం కాదు నెత్తురు బంధం. తల్లి కష్టపడి సంపాదించిన పైసల్లో చదువుకున్నాడు. ఆ పైసలు పుస్తకాలుగా మారాయి. ఆ పుస్తకాలు జ్ఞానంగా మారాయి. ఆ జ్ఞానం కవిత్వంగా మారింది. అంటే ఆయన ‘తెలంగాణ రుబాయిలు’ ముందుమాటలో ఒక తల్లి చేతులు ఉన్నాయి. కానీ ఆ చేతులు కనిపించవు. అవి దాక్కున్నాయి ప్రతి పేజీ లోపల.
✦ ✦ ✦
చిట్యాల పాఠశాల లైబ్రరీ అనే స్వర్గం గురించి ఒక్కసారి చెప్పుకోవాలి. ఒక పేద పిల్లవాడికి ధనంతో కొనలేని ఒకే ఒక విషయం జ్ఞానం. అది పుస్తకాల్లో ఉంది. ఆ పుస్తకాలు ఉచితంగా ఉన్నాయి, లైబ్రరీలో. రష్యన్ అనువాదాలు కుప్రీన్, టాల్స్టాయ్, తుర్గనేవ్. ఈ పేర్లు చూసి ఆశ్చర్యపడకండి. ఆ కాలంలో రష్యన్ సాహిత్యం తెలుగులో సరళంగా అనువదించబడింది. శ్రమజీవుల జీవితాలు, వారి సంఘర్షణలు, వారి స్వప్నాలు అన్నీ ఆ అనువాదాల్లో ఉన్నాయి. ఒక పల్లె పిల్లవాడు అవి చదివినప్పుడు ఏమనిపించింది? ‘ఈ నొప్పి నాకు మాత్రమే తెలిసింది కాదు. ప్రపంచం అంతటా ఉంది.’ అనే సాంత్వన. ఆ సాంత్వన ఆయనను కవిగా మలిచింది.
1983లో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ అబ్బాయి శ్రీనాథ మహాకవి మీద వ్యాసం రాశాడు. మొదటి బహుమతి. ఆ బహుమతి చేసిన పని ఏమిటో చెప్పడం కష్టం. ఒక పేద పిల్లవాడికి ‘నువ్వు చేయగలవు’ అని ఒకరు నిరూపించినప్పుడు కలిగే భావోద్వేగం అది ఒక్కసారి కలిగితే జీవితాంతం ఆగదు. ఇంటర్ రోజుల్లో రేడియోలో కవిత చదివే అవకాశం వచ్చింది. ఆ గొంతు వినిపించింది ఒక పల్లె నుండి వచ్చిన, వలస జీవితపు ఉప్పు మోసిన, తండ్రి లేని ఒక యువకుడి గొంతు. ఆ గొంతు ఆగలేదు.
✦ ✦ ✦
డిగ్రీ చదివే రోజుల్లో పెళ్ళి అయింది మేనమామ కూతురు అరుణతో. ‘పెళ్ళి అయిన తర్వాత చదువు ఆపుతారు’ అనే అభిప్రాయానికి ఆయన సమాధానం మరింత చదివారు. ఎం.ఏ., ఎం.ఫిల్., పీహెచ్.డీ. పెళ్ళి అయిన తర్వాత APPSC పరీక్షలో రాష్ట్రంలో రెండవ ర్యాంకు. ఒకే మనిషి ఇవన్నీ ఎలా చేయగలడు? ఒక జవాబు ఉంది ‘ఆగడం’ అనే పదం ఆయన నిఘంటువులో లేదు.
సినారె అన్నారు ‘కలం నా కరతలం మీద అలిగింది, వారం పది రోజులుగా కరాంగుళులు తనను ముట్టుకోవడం లేదని కలానికి కలత పుట్టింది.’ ఇది హాస్యంగా చెప్పినా, సత్యం ఉంది రాయకపోతే కలమే కలత పడుతుంది. నరసింహారెడ్డికి ఆ కలత తెలుసు. అందుకే తహసీల్దారుగా, అదనపు కలెక్టర్గా, IAS అధికారిగా పని చేస్తున్న నడుమ కూడా కలం ఆగలేదు. ఆగడానికి కలమూ ఒప్పుకోలేదు.
ఆయన రాసిన ‘కొత్తపలక’ సంపుటిలో ‘ఒక ఊరు’ కవిత ఉంది. రెండే రెండు వాక్యాలు:
ఇక్కడొక ఊరుండేది
ఎవరైనా చూపిస్తారా..?
నరసింహారెడ్డి ‘ఒక ఊరు’
‘ఇక్కడొక ఊరుండేది’ past tense. ఉంది కాదు, ఉండేది. ఆ వ్యత్యాసం అర్థం చేసుకోగలిగినవాడికి ఈ కవిత అర్థమవుతుంది. ఆ ఊరు ఎక్కడికి పోయింది? కాంక్రీటు అయిపోయింది. ఆ పెంకుటిల్లు ఎక్కడిది? సిమెంటు వచ్చేసింది. ఆ మొగురం వాసన ఎక్కడిది? ‘అది మాకు తెలుసు మేం చూసాం’ అని చెప్పగలిగిన ఆఖరి తరంలో ఒకడు నరసింహారెడ్డి. అందుకే ఆ వాక్యాలు అంత బరువుగా ఉన్నాయి.
ఇదే ‘కొత్తపలక’లో ‘610’ కవిత – పాలకుల నిర్లక్ష్యాన్ని నేరుగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అలా రాయడానికి సాహసం కావాలి. సాహసానికి మూలం ఏమిటో అడిగితే ఒకే సమాధానం — ‘నిజం చెప్పే భాష నా తల్లి నేర్పింది. ఆ భాష నేను మరిచిపోలేదు.’ అది నిజమైన కవి లక్షణం. పదవి వచ్చినా, పురస్కారాలు వచ్చినా, లేఖనంలో మిగిలే నొప్పి తగ్గదు. అది నరసింహారెడ్డిది.
✦ ✦ ✦
తెలంగాణ రుబాయిలు ఇది ఒక చిత్రమైన సాహిత్య ప్రయోగం. పారశీకపు ఖయ్యామ్ పుట్టించిన రూపం. నాలుగే నాలుగు పంక్తులు. ఒమర్ ఖయ్యామ్ అందులో ద్రాక్షారసాన్ని, ప్రేయసిని, మరణాన్ని పోయాడు. సి.నా.రె తెలుగులో గజళ్ళు రాసినట్టు, నరసింహారెడ్డి రుబాయిలు తెలంగాణ నేలకు తెచ్చారు. దానిలో తెలంగాణ మట్టిని పోశారు, అక్కడి బతుకు వేదనను పోశారు, అక్కడి అస్తిత్వ ఆర్తిని పోశారు. ఒమర్ ఖయ్యామ్ ప్రపంచాన్ని వదిలేద్దాం అని పాడాడు. నరసింహారెడ్డి తెలంగాణను నిలుపుకుందాం అని పాడాడు. రెండూ ఒకే రూపంలో ఇది కవిత్వపు అద్భుతం.
ఆడినప్పుడు ఆట విలువలు తెలియరావు
గెంతినప్పుడు స్వేచ్ఛ ఎత్తులు తెలియరావు
అనుభవించిన క్లేషమే చుక్కాని తుదకు
చిమ్మచీకటి కమ్మ; దారులు తెలియరావు
– నరసింహారెడ్డి , తెలంగాణ రుబాయిలు
ఈ నాలుగు పంక్తులు చదివిన ప్రతిసారీ అనిపిస్తుంది ‘అనుభవించిన క్లేషమే చుక్కాని’ అని ఆయన తన జీవితం గురించి చెప్పాడు. ఆ క్లేషం — తండ్రి మరణం, వలస బాటలు, పేదరికం అవే ఆయనను కాపాడాయి. రష్యన్ నవలలు చదివి ‘ఇది నా నొప్పి కాదు, ప్రపంచపు నొప్పి’ అని అర్థం చేసుకున్న ఆ లైబ్రరీ పిల్లవాడికి చుక్కాని తెలిసింది. APPSC లో రెండవ ర్యాంకు తెచ్చుకున్నప్పుడు చుక్కాని పటిష్ఠమైంది. IAS అయినప్పుడు సముద్రమంత నిశ్శబ్దమైంది.
✦ ✦ ✦
ఒకసారి ఆలోచించండి తెలుగు కవిత్వపు చరిత్ర ఒక వారసత్వం. గురజాడ ‘దేశమును ప్రేమించు మన్నా’ అని మొదలుపెట్టాడు. శ్రీశ్రీ ‘పదండి ముందుకు పదండి తోసుకు’ అని ఉత్సాహం ఇచ్చాడు. కాళోజీ ‘నా గొడవ’ గళమెత్తాడు. దాశరథి తెలంగాణ మట్టి కోసం ఆర్తపడ్డాడు. ఆ పరంపర ఎక్కడ ఆగింది? ఎక్కడా ఆగలేదు. నరసింహారెడ్డి ఆ పరంపర కొనసాగింపు.
ఆయన పరిశోధన అంశం చూడండి ‘గుర్రం జాషువా, దిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం.’ జాషువా హరిజన కవి, దేశంలో అవమానాలు పడ్డవాడు. దిలాన్ థామస్ వేల్స్ కవి, అణచివేతకు గురైన జాతి నుండి వచ్చినవాడు. ఇద్దరూ బాల్యాన్ని కవిత్వంలో పట్టుకున్నవాళ్ళు. నరసింహారెడ్డి ఆ ఇద్దరినీ ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకంటే ఆయన తన బాల్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్నాడు. తన బాల్యాన్ని అర్థం చేసుకోవడానికి వేరే ఖండాల్లో, వేరే భాషల్లో తన వంటి బాల్యాలను వెతికాడు. అవి దొరికాయి. అది పరిశోధన అయింది. ఆ పరిశోధనలోంచి కవి మరింత పరిపక్వమయ్యాడు.
అప్పుడు హలంపట్టి దున్నిన ఆ చేయి
ఇప్పుడు కలం పట్టి దున్నుతున్నది
అప్పటి ఆ నాగటి చాళ్ళ వంకరలు
ఇప్పుడు ఈ కలంలోంచి వక్రోక్తులుగా వెలువడుతున్నాయి
– సి.నా.రె , క్షేత్రబంధం
సినారె తన తండ్రి పొలం గురించి రాశారు ‘హలంపట్టిన చేయి ఇప్పుడు కలం పట్టింది.’ నరసింహారెడ్డికి ఇది అక్షరాలా వర్తిస్తుంది. ఆయన తండ్రి రైతు. ఆ మట్టిలో పుట్టిన వాడు ఇప్పుడు కలం పట్టి తెలంగాణ సాహిత్యాన్ని దున్నుతున్నాడు. ఆ ‘వంకరలు’ అంటే జీవిత కష్టాలు, మలుపులు అవే కవిత్వంలో వక్రోక్తులుగా వెలువడుతున్నాయి. ఇంతకంటే అందమైన analogy మరొకటి ఉంటుందా?
✦ ✦ ✦
ఒక మనిషి గురించి రాసేటప్పుడు ఆ మనిషి ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న వస్తుంది. నరసింహారెడ్డి ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు. IAS అధికారి. కానీ ఆ పదవులన్నీ చెప్పినా, ఒక్క మాట చెప్పలేదు ఆయన ఇప్పటికీ ఆ పిల్లవాడే. చిట్యాల పాఠశాల లైబ్రరీలో కుప్రీన్ చదివిన పిల్లవాడే. ‘ఇక్కడొక ఊరుండేది, ఎవరైనా చూపిస్తారా’ అని వెతికే పిల్లవాడే. ఆ పిల్లవాడు IAS అయినా పోలేదు. అందుకే ఆయన రాసేది కవిత్వం నివేదిక కాదు.
ఆయన సాహిత్యంపై డా. నర్రా ప్రవీణ్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్.డీ చేశారు. ‘అరతెర తీసిన రంగస్థలం’ అనే సంకలనం వచ్చింది. జీవించి ఉన్న కవిపై పరిశోధన జరుగుతుందంటే అది ఆ కవికి ఇవ్వగలిగే అతిపెద్ద నివాళి. అది పురస్కారం ఇవ్వడం కాదు ‘నువ్వు రాసింది మా తర్వాతి తరాలకు కూడా కావాలి’ అని చెప్పడం. నరసింహారెడ్డికి ఆ గుర్తింపు వచ్చింది. తగినట్టే వచ్చింది.
✦ ✦ ✦
చివరగా ఒక విషయం అడగాలనుంది ఒక కవి గొప్పతనం ఏమిటి? పురస్కారాలా? పరిశోధనలా? పుస్తకాలా? కాదు. ఒక పాఠకుడి జీవితాన్ని కొంచెమైనా మార్చగలిగాడా అది. ఒక కుర్రాడు ‘కొత్తపలక’ చదివి ‘నా నొప్పికి భాష ఉంది, నా కష్టానికి కవిత్వం ఉంది’ అని అర్థం చేసుకుంటే అదే నరసింహారెడ్డి సాధించింది. ఒక అమ్మాయి ‘తెలంగాణ రుబాయిలు’ చదివి ‘నా తల్లి, నా మట్టి, నా భాష విలువైనవి’ అని నిలబడితే అదే ఆ రుబాయిలు చేసింది.
శ్రీశ్రీ అన్నాడు –
అనితర సాధ్యం నా మార్గం
నా వినిపించే నవగీతికి
నా విరచించే నవీన రీతికి
భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం
– శ్రీశ్రీ , మహాప్రస్థానం
నరసింహారెడ్డిదీ అలాంటి మార్గమే. అనితర సాధ్యమైన మార్గం — పేద కుటుంబం నుండి వచ్చి, వలసల వేదన మోసి, తండ్రిని కోల్పోయి, అమ్మ కూలి పని చేయగా చదువుకుని, పెళ్ళైన తర్వాత కూడా చదివి, ఉద్యోగం చేస్తూ కవిత్వం రాసి, IAS అయి, తెలుగు భాషను కాపాడే బాధ్యత నెత్తిన మోసిన మనిషి — ఆయన మార్గం మరొకరికి సులభంగా అనుకరించగలిగేది కాదు. అందుకే అది విశేషమైనది.
‘విశ్వంభర’లో సినారె రాశారు ‘నేను పుట్టక ముందే నెత్తి మీద నీలితెర, కాళ్ళ కింద ధూళి పొర.’ నరసింహారెడ్డి ఆ ధూళి పొరలోంచి వచ్చాడు. ఆ నీలితెరను తెంచుకున్నాడు. తెంచుకుని ఆకాశాన్ని తాకాడు. ఆకాశం తాకిన తర్వాత వెనక్కి తిరిగి మళ్ళీ ధూళిపొరను చూశాడు అక్కడ ఇంకా బందీ అయి ఉన్న వాళ్ళకోసం కవిత్వం రాశాడు. అది కవి బాధ్యత. ఆ బాధ్యతను ఆయన నిర్వర్తించాడు. నిర్వర్తిస్తున్నాడు.
-పురుషోత్తం నారగౌని, మొబైల్ :8897388393
Posts Carousel
Latest News
చుక్కాని పట్టుకున్న కవి
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి జన్మదినం సందర్భంగా ఒక పుస్తకం మొదటిసారి చేతుల్లో పట్టుకున్నప్పుడు కలిగే అనుభవం వేరే ఏ అనుభవానికీ పోలదు. కాగితం వాసన, పేజీల అంచు, ఆ కొంచెం బరువు ఇవన్నీ కలిసి…
‘జల’ జగడం: సుప్రీం చేతిలో పోలవరం భవితవ్యం..
రేవంత్పై ఏపీ మంత్రి ఫైర్! (వాడివేడిగా గోదావరి జలాల వివాదం – ఢిల్లీలో సుప్రీం విచారణ) (అమరావతి/న్యూఢిల్లీ – తెలుగు ప్రపంచం ప్రత్యేక ప్రతినిధి) సంక్రాంతి పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య “జల” రాజకీయం మరోసారి వేడెక్కింది. ఒకవైపు…
చరిత్రలో తొలిసారి.. అడవి బిడ్డల చెంతకు ‘పాలన’!
మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ – రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం (హైదరాబాద్/ములుగు – తెలుగు ప్రపంచం ప్రత్యేక ప్రతినిధి) సాధారణంగా మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) అంటే.. రాష్ట్ర రాజధానిలో, సకల సౌకర్యాలు ఉన్న సచివాలయంలో, ఏసీ గదుల మధ్య…
ది రాజా సాబ్
వింటేజ్ ప్రభాస్ మ్యాజిక్… కథలో లాజిక్ మిస్! సినిమా: ది రాజా సాబ్ (The Raja Saab) నటీనటులు: ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, జరీనా వహబ్, బోమన్ ఇరానీ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్,…
భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Vijnapthi)
సినిమా: భర్త మహాశయులకు విజ్ఞప్తి నటీనటులు: రవితేజ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, వెన్నెల కిషోర్, సునీల్, సత్య, గెటప్ శ్రీను తదితరులు. దర్శకత్వం: కిషోర్ తిరుమల నిర్మాత: సుధాకర్ చెరుకూరి సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల ఎడిటింగ్:…